ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. నిన్న కూడా కొత్తగా 82 కేసులు నమోదవడంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,259కి చేరింది. తొలి 603 కేసులు నమోదు అవడానికి 38 రోజుల సమయం పట్టగా... తర్వాత 10 రోజుల్లోనే మరో 656 కేసులు నమోదయ్యాయి.
ఇక మూడు రోజుల్లోనే 243 మంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క కర్నూల్ జిల్లాలోనే కరోనా కేసుల సంఖ్య 300ను దాటడంతో ఆ జిల్లా వాసుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. జిల్లాలో గడిచిన 24 గంటల్లో మొత్తం 6,908 టెస్టులు చేయగా 40 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల్లో 26.37 శాతం ఈ జిల్లాలోనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా జిల్లాలో మరో వైద్యురాలికి కరోనా సోకిందనే వార్త కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది వైద్యులు కరోనా బారిన పడడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. రోగులకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలోనే వైద్యుల కూడా కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.