వెండి తెరపై వైవిధ్యమైన నటనతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న ఇర్ఫాన్ ఖాన్ చివరి జీవితం ఎంతో ఆవేదనతో.. ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీటి సుడులు మిగిల్చింది. 2018 లో న్యూరోఎండోక్రిన్ ట్యూమర్తో బాధపడ్డ ఆయన లండన్లో చికిత్స పొందారు. ఇర్ఫాన్ తల్లి సైదా బేగం ఎప్రిల్ 25 ఉదయం కన్ను మూసింది. లాక్డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. తల్లి చనిపోయి కొద్ది రోజులు కూడా కాకముందే ఇర్ఫాన్ కాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశాడు. ఆయన మరణవార్తతో సినీలోకం శోఖసంద్రంలో మునిగిపోయింది.
ఇర్ఫాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఇర్ఫాన్ కుటుంబానికి సంతాపం తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ ను కడసారి చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇర్ఫాన్ భౌతికఖాయాన్ని సందర్శించి, నివాళులర్పించే అవకాశం కూడా లేదు. మరోపక్క ఆయన అంత్యక్రియలకు సైతం కుటుంబ సభ్యులు మినహా ఇతరులెవరూ హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన నటుడి చివరి ఘడియలు ఇంత దయనీయంగా మారడంపై సినీ లోకాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది.