కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాలో విధ్వంసం సృష్టిస్తోంది. వేలాదిమంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. ఆర్థిక రంగాన్నికోలుకోలేని దెబ్బకొడుతోంది. కొవిడ్-19 కారణంగా అమెరికా జీడీపీ 4.8 శాతం పడిపోయిందని ఆ దేశ అధికారిక రికార్డులు తెలియజేస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది భారీ దెబ్బేనని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు మొత్తం పది లక్షలకు పైగానే కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 60 వేల మరణాల వరకు సంభవించాయి. ప్రపంచం మొత్తం కేసుల్లో ఇది మూడో వంతు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ లెక్కన ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు కరోనా బాధితుల్లో ఒకరు అమెరికాలో ఉండడం దిగ్భ్రాంతికరమైన విషయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఒకటి రెండు రోజులుగా అమెరికాలో మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మొన్నటివరకు ఒక్కరోజులోనే మూడు, నాలుగువేల మందికూడా మరణించారు. ఈరోజు కేవలం 1300మందికిపై మరణించారు. ముందుముందు కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.