తెలంగాణలో పాలిసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. అయితే.. దానిని మే 9వ తేదీ వరకు పొడిగించినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యాశిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి మూర్తి ప్రకటించారు. లాటరల్ ఎంట్రి ఇన్ టూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎల్పీసెట్) దరఖాస్తుల గడువు మే 11 వరకు పొడిగించామని ఆయన వెల్లడించారు. అలాగే.. తెలంగాణలో టీఎస్ఎంసెట్ కోసం బుధవారం వరకు 1,92,162 దరఖాస్తులు వచ్చాయని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు మే ఐదు వరకు గడువు ఉన్నదని వెల్లడించారు. లాక్డౌన్లో దరఖాస్తుల గడువు పొడిగించే అవకాశం ఉన్నదని తెలిపారు.
కాగా, లాక్డౌన్ కారణంగా విద్యార్థులు నష్టపోకుండా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటోంది. మధ్యలోనే ఆగిపోయిన పదో తరగతి వార్షిక పరీక్షలను లాక్డౌన్ ముగియగానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.