దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తుందని.. వైరస్ ప్రబలిపోకుండా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికి పోలీసులు కొన్ని చోట్ల నచ్చజెప్పడం.. ప్రాదేయపడటం చూస్తున్నాం. మరికొన్ని చోట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.. చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. తాజాగా ఆలయంలో పూజలు చేయడానికి వెళ్తున్న పూజారికి పోలీసులు విచిత్రమైన శిక్ష విధించారు. యూపీలోని కాన్పూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనకీలోని ఓ ఆలయంలో పూజలు చేయడానికి వృద్ధ పూజారి వెళ్తున్నాడు.
లాక్డౌన్ డ్యూటీలో ఉన్న వినోద్ కుమార్ సింగ్ అనే పోలీసు అధికారి అతన్ని మందలించాడు. కరోనా విస్తరిస్తున్న సమయంలో ఇలా బయటకు వెళ్లడం తప్పని హెచ్చరించారు. అంతే కాదు కప్పలా గెంతుకుంటూ ఆలయానికి వెళ్ళమని ఆదేశించాడు. దీంతో చేసేదేమి లేక పోలీసులు చెప్పినట్టుగానే మోకాళ్లపై గెంతుకుంటూ వెళ్లాడు.
అయితే దేవుడికి పూజలు చేసేందుక వెళ్తున్న పూజారి పట్ల ఇలా ప్రవర్తించడంపై స్థానికులు, నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఎస్పీ అనిల్ కుమార్ స్పందించారు. ఈ ఉదంతానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చేతిలో హారతి పట్టుకొని ఆ పూజారి కప్పలా గెంతుతూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.