లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ బాధ్యతలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించింది. అయితే.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం లాక్డౌన్ సడలింపుల ప్రకటన జారీచేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వలస కార్మికుల తరలింపుకు ఉచితంగా రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించారు. వలస కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గురువారం జరిగిన ఓ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బస్సుల్లో తరలించాలని నిర్ణయించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బిహార్, జార్ఖండ్, చత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 15 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని తెలిపారు. తెలంగాణ నుంచి బీహార్, జార్ఖండ్, చత్తీస్గడ్కు బస్సుల్లో వెళ్లేందుకు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుందన్నారు. ఇది కూలీలకు చాలా ఇబ్బందికరమైన ప్రయాణమని తలసాని పేర్కొన్నారు. రైళ్ళలో వలస కూలీలను వారి స్వరాష్ట్రాలకు చేర్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా బస్సులతో స్వగ్రామాలకు తరలించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు.