దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ను మే 3వ తేదీ తర్వాత ఎక్కువగా సడలింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం 15 నగరాల్లో మాత్రమే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నగరాల నుంచే అధికమొత్తంలో కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే.. ఈ నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు నగరాలకు చోటు దక్కింది. తెలంగాణలో హైదరాబాద్, ఏపీలో కర్నూలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా రెడ్జోన్లో ఉన్న ఈ 15 నగరాల్లో మాత్రం యథావిధిగా ఎలాంటి సడలింపులు లేకుండా లాక్డౌన్ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్, కర్నూలులో మాత్రం లాక్డౌన్ మరో ఒకటి రెండు నెలలపాటు కొనసాగించేందుకే ప్రభుత్వాలు మొగ్గుచూపుతాయని అంటున్నారు.
దేశవ్యాప్తంగ నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో ఈ నగరాల్లో నమోదు అవుతున్న కేసుల శాతం ఇలా ఉంది.. ఢిల్లీలో 12.62శాతం, ముంబైలో 11.62, అహ్మదాబాద్లో 9.43, ఇండోర్ 4.48, జైపూర్లో 3.49, పుణెలో 2.95శాతం, హైదరాబాద్లో 2.41శాతం, సూరత్లో 2.29శాతం, చెన్పైలో 2.28శాతం, ఠానెలో 1.7శాతం, ఆగ్రాలో 1.62శాతం, జోద్పూర్లో 1.58శాతం, భోపాల్లో 1.34శాతం, కర్నూలులో 1.2శాతం, వడోదరలో ఒక శాతం కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నగరాల్లో లాక్డౌన్ను ఎత్తేయకుండా యథావిధిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.