ఉత్తరకొరియా అధినేత కిమ్కు సంబంధించి అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయి.. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు..? ఏం చేస్తున్నాడు..? తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారా..? అంటే.. బయటి ప్రపంచానికి మాత్రం ఏమీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఒకానొక దశలో కిమ్ ఇక లేరు..? అంటూ కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న దక్షిణ కొరియా ఆసక్తికరమైన ప్రకటన చేసింది. కిమ్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయనకు ఏమీ కాలేదని ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కిమ్ ఆరోగ్యంగానే ఉన్నారని, తనకు అంతా తెలుసునని చెబుతున్నారు. కానీ.. ఉత్తర కొరియా మాత్రం ఇప్పటివరకు కిమ్ గురించి ఒక్క మాట కూడా చెప్పడం లేదు. అసలు ఆ దేశంలో ఏం జరుగుతుందో కూడా బయటకు తెలియని పరిస్థితి ఉంది.
ఈ క్రమంలోనే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వస్తోంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాతే..కిమ్ గురించి అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కిమ్ గురించిన విషయాలు బయటకు తెలిస్తే.. తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని భావిస్తున్న ఉత్తరకొరియా.. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతే కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదిఏమైనా.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం రెండే రెండు విషయాల గురించి మాట్లాడుతోంది. ఒకటి కరోనా మహమ్మారి.. రెండోది.. ఉత్తరకొరియా నియంత కిమ్..! ఏం జరిగిందో కాలమే చెప్పాలిమరి.