*అఢాల్ప్ హిట్లర్ ఇంకా బ్రతికే ఉన్నాడా? మై గాడ్* ఇదీ జనసేన నేత, నటుడు నాగబాబు తాజాగా చేసిన ట్వీట్! నాగబాబు సెటైర్ వేసిన ఆ హిట్లర్ ఎవరన్నదానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నాగబాబు నర్మగర్భంగా చేసిన ఈ ట్వీట్లోని ఆంతర్యం ఏమిటన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా నాగబాబు అధికార వైసీపీని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై కూడా నాగబాబు ట్వీట్ చేశారు. మాస్క్ ఉండాల్సింది మెడలో కాదు.. ముక్కుకు.. కాస్త మాస్క్ ధరించండి.. అంటూ విజయసాయి ఫొటోను షేర్ చేశారు. నిజానికి.. విజయసాయి నిత్యం మాస్క్ ధరించే కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
అయితే.. మాట్లాడుతున్న సమయంలో.. ఒక్కోసారి ధరించడం లేదు. మాస్క్ ధరించని టైంలో తీసిన ఫొటోను నాగబాబు షేర్ చేస్తూ ఆ కామెంట్ చేశారు. ఇదే సమయంలో మాస్క్ ధరించిన నేత అంటూ తెలంగాణకు చెందిన మంత్రి ఫొటోను కూడా నాగబాబు షేర్ చేశారు. అయితే.. ఇక్కడ ప్రత్యేకంగా వైసీపీని, అందులోనూ విజయసాయిరెడ్డిని నాగబాబు టార్గెట్ చేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇక తాజాగా.. ఆఢాల్ఫ్ హిట్లర్ ఇంకా బ్రతికే ఉన్నాడా..? అంటూ నాగబాబు చేసిన ట్వీట్ సీఎం జగన్ను ఉద్దేశించే కావొచ్చునని పలువురు అంటున్నారు. కర్నూలులో కరోనా కేసులు పెరగడాన్ని సీరియస్గా తీసుకున్న జగన్ సర్కార్ మున్సిపల్ కమిషనర్పై బదిలీవేటు వేసింది. దీనిని దృష్టిలో ఉంచుకునే నాగబాబు ఈ ట్వీట్ చేసి ఉంటారనే టాక్ వినిపిస్తోంది.
అఢాల్ప్ హిట్లర్ ఇంకా బ్రతికే ఉన్నాడా? మై గాడ్ pic.twitter.com/qxsRyayH01
— naga Babu konidela (@NagaBabuOffl) April 30, 2020