అందరూ ఊహించినట్టే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంతేగాకుండా.. ఉన్నతస్థాయి వైద్యాధికారి కూడా ఇటీవల మృతి చెందారు. మరో డాక్టర్ కూడా కరోనాకు బలి అయ్యారు. చూస్తుండగానే కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లోనూ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మే 3వ తేదీ తర్వాత లాక్డౌన్ పొడిగించాలని, మే 21వ తేదీ వరకు కొనసాగించాలని సూచించారు.
తాజాగా.. ఆ తేదీని దాటేసి.. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్డౌన్ పొడగించాలని నిర్ణయించింది. ఏకంగా మే చివరి వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు కొన్నికొన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. చిన్న దుకాణాలు, ఎంపిక చేసిన గ్రీన్ జోన్లలో వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.