లాక్డౌన్ కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబందించి కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ ఎంసెట్, టీఎస్ ఐసెట్-2020సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షల ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును మే 15 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఎడ్సెట్, లాసెట్, ఈసెట్, పీజీసెట్, పీఈసెట్, పీజీఈసెట్లకు కూడా ఈ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. గతంలో ప్రకటించిన గడువు మే ఐదో తేదీతో ముగియనుండటం, మే ఏడు వరకు లాక్డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే రాజిరెడ్డి వేర్వేరు ప్రకటనలు విడుదలచేశారు.
అలాగే.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో జాతీయస్థాయి వ్యవసాయ కోర్సుల ప్రవేశపరీక్ష (ఐకార్-2020) దరఖాస్తుల గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 15 వరకు పొడిగించింది. జూన్ 1న నిర్వహించాల్సిన ప్రవేశపరీక్షను కూడా వాయిదావేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నది.