దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లలో కేంద్రం పలు మార్పులు చేసింది. కొత్త జాబితా ప్రకారం... రెడ్జోన్లలో 130 జిల్లాలు, ఆరెంజ్ జోన్లలో 284, గ్రీన్ జోన్లలో 319 జిల్లాలు ఉన్నాయి. కరోనా ప్రభావం, జోన్లలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ లేఖ రాశారు. రెడ్జోన్లో అత్యధికంగా యూపీలోని 19 జిల్లాలు, మహారాష్ట్రలోని 14 జిల్లాలు, తమిళనాడులో 12, ఢిల్లీ 11, బెంగాల్లో 10 జిల్లాలను కేంద్రం చేర్చింది. రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు జోన్లలో మార్పులు చేశామని ప్రీతి సూడాన్ స్పష్టం చేశారు.
ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో కేంద్రం కొన్ని మార్పులు చేయడం గమనార్హం. కేంద్రం చేసిన తాజా మార్పులతో ఏపీలోని 13 జిల్లాల్లో 5 జిల్లాలు ( కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు) రెడ్ జోన్ పరిధిలోకి వచ్చాయి. 7 జిల్లాలు ఆరెంజ్ జోన్లో చేర్చారు. తెలంగాణలో రెడ్జోన్లో 6 జిల్లాలను ( హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలు) చేర్చారు. ఆరెంజ్ జోన్లో 18 జిల్లాలు, గ్రీన్జోన్లో 9 జిల్లాలను చేర్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.