మే 3వ తేదీతో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ముగియనుంది. ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాతోపాటు పలువురు ఉన్నత స్థాయి అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. లాక్ డౌన్ కొనసాగింపు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా మోడీ వీరితో చర్చించారు. అయితే లాక్డౌన్ కొనసాగిస్తారా.. ? లేక ఎత్తివేస్తారా ..? అన్నదానిపై ప్రధాని మోడీ రేపు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే లాక్డౌన్ పై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన మోడీ ...వారందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లాక్డౌన్ కొనసాగించాలని కొందరు, సడలించాలని, ఆంక్షలు ఎత్తివేయాలని మరికొందరు సీఎంలు సూచించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ప్రధాని... భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే రేపు ఉదయం ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా ప్రధాని చేయబోయే ప్రకటనపై దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.