దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 3వ తేదీ తర్వాత కూడా లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 3వ తేదీ తరువాత రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలంలో వివిధ కార్యకలాపాలను నియంత్రించడానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలోని జిల్లాల వారీగా అంటే రెడ్ (హాట్స్పాట్) ), గ్రీన్, ఆరెంజ్ జోన్లుగా విభజించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోకి వచ్చే జిల్లాల్లో గణనీయమైన సడలింపులను ఇచ్చింది. అయితే.. కేంద్రం నిర్ణయంపై కరోనా వైరస్ ప్రభావం లేని రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారుతోంది.
గోవా, సిక్కిం, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు పెద్దగా లేవు. కరోనా రహిత రాష్ట్రాలుగా ప్రకటించుకున్నాయి. మరి ఈ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని అమలు చేస్తాయా..? అన్నది ఆసక్తికరంగా మారుతోంది. అంతేగాకుండా.. తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్డౌన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే... తెలంగాణలో మే 7వ తేదీ తర్వాత కూడా కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా లాక్డౌన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తారా..? లేదా..? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి.. లాక్డౌన్ తేదీ విషయంలో కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా గత నెలలో పలు రాష్ట్రాలు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో ఎన్ని రాష్ట్రాలు ఏకీభవిస్తాయో చూడాలి మరి.