దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించింది. ఈ జోన్ల కిందకు వచ్చే జిల్లాలను ప్రకటించింది. అయితే.. కేంద్రం నిర్ణయంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ జోన్ల విభజన సరిగా జరగలేదని విమర్శించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 10 రెడ్ జోన్ల జాబితా నుండి ఆరు జిల్లాలను తొలగించాలని కేంద్రానికి లేఖ రాసింది . దేశం మొత్తం గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల జాబితాను కేంద్రం జారీ చేసిన కొన్ని గంటల్ల్నే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం లేఖను రాస్తూ ఈ డిమాండ్ చేసింది.
ఇది తప్పుడు విభజన అంటూ పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బిబెక్ కుమార్ లేఖ రాశారు. సౌత్-24 పరగణాలు, పశ్చిమ మిడ్నాపూర్, డార్జిలింగ్, జల్పాయిగురి, కాలింపాంగ్, మాల్డా జిల్లాలను రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్లలోకి మార్చాలని కోరారు. ఆయా జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా లేకున్నా.. రెడ్జోన్లలోకి కేటాయించిందని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అంటోంది. ఇక దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.