ఆరోగ్య సేతు యాప్పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులందరూ ఆరోగ్య సేతు యాప్ను కచ్చితంగా వాడాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సంస్థల అధిపతులకు ఈ బాధ్యతలు అప్పగించింది. ప్రతీ ఉద్యోగి ఈ యాప్ను వాడేలా చూడాలని ఆదేశించింది. కాగా.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమగ్ర సమాచారంతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే. విడుదల అయిన రోజే ఈ యాప్ కొన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత స్మార్ట్ఫోన్ కొనుగోలు చేస్తే ఆరోగ్యసేతు యాప్లో యూజర్లు తమ వివరాలను తప్పసరిగా నమోదు చేసుకునేలా కూడా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఫోన్ కొన్నాక ఉపయోగించడానికి ముందే ఆరోగ్యసేతు యాప్లో వివరాలను నమోదు చేసుకునేలా నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం యత్నిస్తోందని తెలుస్తోంది. ఈ విధానం కచ్చితంగా అమలయ్యేందుకు ఒక నోడల్ ఏజెన్సీని కూడా ప్రారంభిస్తుందట. ఆ ఏజెన్సీ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలతో సమన్వయం చేసుకొని ఆరోగ్యసేతు యాప్ అన్ని ఫోన్లలో తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోనుంది. అయితే.. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. కొత్తఫోన్లో యాప్ ప్రీ-ఇన్స్టాల్డ్గా రావడం మాత్రమే కాదు ఆరోగ్యసేతు యాప్లో రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాతే ఫోన్ ఉపయోగించడానికి వీలవుతుందట. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 7.5కోట్ల మంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు.