కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా నిరుపేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో పనిలేక, తినేందుకు తిండిలేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న న్యూస్ పేపర్లో ఒక ఫొటో అందరినీ కలచివేసింది. అందరి గుండెలను మెలిపెట్టింది. వృద్ధుడైన పేద బ్రాహ్మణుడు హైదరాబాద్లో రోడ్డుపైన యాచిస్తున్న ఫొటో పేపర్లో వచ్చింది. ఈ ఫొటో పరిస్థితులు ఎంత దయనీయంగా మారుతున్నాయో చెబుతుంది. ఈ ఫొటోను చూసి అనేక మంది కంటతడి పెట్టుకున్నారు.
ఆ పేద బ్రాహ్మణుడు యాచించడం న్యూస్ చూసి సినీ నటుడు టార్జాన్ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆయన వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. కూకట్పల్లిలో ఉంటారని తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లి ఆ పేద బ్రాహ్మణుడి కుటుంబానికి మూడు నెలలకు సరిపడా సరుకులు, 25000 రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు టార్జాన్ లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణను అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు కూడా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారట.