దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. తాజాగా.. ఒకే భవనంలో 41మందికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగుతోంది. నైరుతి ఢిల్లీలో కపాషెరాలోని జిల్లా కమిషనర్ కార్యాలయానికి సమీపంలో థెకే వ్యాలీలో ఉన్న భవనంలో 41మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. అయితే.. ఈ భవనంలో గతంలో ఒకరికి కరోనా సోకింది. దీంతో అప్పటి నుంచి ఈ భవనాన్ని మూసివేశారు. ఆ ఒక్కరి నుంచే వీరందరికీ కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.
కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 3515 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 59 మంది మరణించారు. కాగా, నిన్న అధికార పార్టీ ఆప్ ఎమ్మెల్యేతోపాటు అతని సోదరుడికి కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ కట్టడికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మనెంట్ జోన్లలో మరింత కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నారు.