ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి మందులేదు.. వ్యాక్సిన్ రావడానికి చాలా కాలమే పడుతుంది. అయితే.. ఈ వైరస్ బారి నుంచి మనల్నిమనం కాపాడుకోవడానికి సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. మనుషులు మాత్రమేగాదు.. జంతువులు కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తాయని తాజా పరిశోధనలో తేలింది. కొంతమంది నిపుణులు గబ్బిలాలపై విస్తృతమైన పరిశోధనలు చేశారట. అందులో మనం నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. గబ్బిలాలు అనారోగ్యానికి గురైనప్పుడు వాటికవే భౌతిక దూరాన్ని పాటిస్తన్నట్లు తేలిందట. వాంపైర్ జాతికి చెందిన గబ్బిలాలు జబ్బునపడినప్పుడు భౌతిక దూరాన్ని పాటిస్తాయని, జబ్బు పడిన వాటికి ఆహారాన్ని అందిస్తాయని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనంలో తేలింది. అయితే ఇక్కడ మరొక విషయం ఉంది.
ఈ గబ్బిలాలు అన్ని జబ్బులకు ఇలా సోషల్ డిస్టెన్సింగ్ పాటించవట. కేవలం వైట్నోస్ సిండ్రోమ్ ఫంగల్ వ్యాధి సోకినప్పుడే ఇలా భౌతిక దూరాన్ని పాటిస్తాయని వారు పేర్కొన్నారు. కాగా, గబ్బిలాలతో పాటుగా చీమలు, కోతులు కూడా ఎన్నో ఏళ్ల నుంచి భౌతిక దూరాన్ని పాటిస్తున్నట్లు ఆ అధ్యయనంలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనికి నిదర్శనంగా హిమాచల్ ప్రదేశ్లోని ఓ రోడ్డులో కోతులన్నీ దూరం దూరంగా కూర్చొని ఉన్న ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే.