కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలింపులను పెంచుతోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఆధారంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా విభజించింది. రెడ్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు యథావిధిగా అమలు చేయాలని కేంద్రం చెప్పింది. ఇదే సమయంలో ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇక గ్రీన్ జోన్లో మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. లాక్డౌన్ కారణంగా వివిధ నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో వందలు వేలాది మంది కార్మికులు సొంతూళ్లకు తరలివెళ్లేందుకు రైల్వేస్టేషన్లకు తరలివస్తున్నారు. గుంపులుగుంపులుగా వస్తున్నారు. ఎక్కడ కూడా సామాజికదూరం పాటించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్లోని బస్తీకి వెళ్లిన వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. అయితే.. భారత్లో లాక్డౌన్ సడలింపులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సడలింపులు ఇవ్వడం మంచి పరిణామం కాదని, వైద్యసదుపాయాలు తక్కువగా ఉన్న భారత్ మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇదే సమయంలో అగ్రరాజ్యం అమెరికాను కూడా డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. ఆ దేశంలో లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడం మంచికాదని సూచించింది. దీనిపై భారత్, అమెరికాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.