దేశంలో కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 25శాతానికిపైగానే ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 37,776 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 10,018 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 26,535 ఉన్నాయి. అటు మహమ్మారి దాడికి 1223 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. అయితే.. గత 24 గంటల్లో భారత్ లో 2411 కరోనా కేసులు నమోదు కాగా, 71 మరణాలు సంభవించాయి.
దేశంలో ఒక్కరోజులో అత్యధికంగా కేసులు నమోదైంది ఈరోజేకావడం గమనార్హం. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని జిల్లాలను కరోనా కేసుల తీవ్రత ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన విషయం తెలిసిందే. మరోసారి లాక్ డౌన్ను రెండు వారాల పాటు పొడిగిస్తూ నిన్న ప్రకటించింది. అయితే మే 4 నుంచి ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పలు సడలింపులను ఇచ్చింది. రెడ్ జోన్లలో మాత్రం ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.