ఏపీలో కరోనా వైరస్ కట్టడిపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని ఆయన తెలిపారు. భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని, ఇలా కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.
అంగన్వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్ శాఖ గ్రామాల్లో కరోనా క్వారంటైన్ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాల కోసం ఒక వ్యక్తికే పాస్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వైద్యుడు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్త, మందులు కూడా మొబైల్ యూనిట్కు అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అన్నారు. కంటైన్మెంట్ జోన్ల వారీగా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించారు.