కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ వల్ల నష్టపోతున్న కీలక రంగాలకు అందజేయాల్సిన రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు మోడీ శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోపాటు పలువురు మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ప్రస్తుత ఆర్థిక రంగం స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో తొలి విడతగా రూ.1.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరో ప్యాకేజీని ప్రకటించేందుకు మోడీ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో కొద్దిరోజులుగా వరుసగా సమావేశమవుతున్నారు. ప్యాకేజీ ఎలా ఉండాలనే దానిపై వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
ప్రధానంగా పేదలకు సాయం అందించేలా ఈ ప్యాకేజీ ఉంటుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు, వంట గ్యాస్ పంపిణీ, పేద మహిళలకు, వృద్ధులకు నగదు పంపిణీ వంటివి ఈ ప్యాకేజీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ప్యాకేజీ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. చాలా రోజులుగా ఈ ప్యాకేజీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.