కరోనాకు విరుగుడుగా మొన్నటివరకు మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ పేరు వినిపించింది. తాజాగా.. మరో మందు పేరు వినిపిస్తోంది. దాని పేరు ఫెమోటీడైన్.. దీనిని గుండె మంటను తగ్గించడానికి వైద్యులు సిఫారసు చేస్తుంటారు. ఈ ఒక్కో ట్యాబ్లెట్ ధర 30 నుంచి 40 పైసలే ఉంటుంది. భారత్లో దొరికే అతి చౌక ఔషధాల్లో ఇది కూడా ఒకటి. అయితే చైనాలోని వూహాన్లో కరోనా పేషెంట్లపై ఈ మందును అందించగా మంచి ఫలితాలు వచ్చాయంటూ ‘సైన్స్ మ్యాగ్’ జర్నల్ తాజా సంచికలో వెల్లడించింది. *వూహాన్లో కరోనా రోగుల్లో 80 ఏళ్లకు పైబడిన వారూ ఉన్నారు. వీరిలో ఎక్కువ మందికి గుండె మంట లక్షణం ఉంది. దీన్ని తగ్గించడానికి వైద్యుడు ఫెమోటీడైన్ను వాడారు. ఇది వాడిన వారిలో 14 శాతం మంది మాత్రమే మరణించగా.. వాడని వారిలో 27 శాతం మంది మరణించారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది* అని ఈ వ్యాసంలో ప్రస్తావించారు.
అంటే.. మందు వాడిన వారు కోలుకోవడానికి బాగానే ఉపయోగపడిందన్నమాట. ఈ నేపథ్యంలో న్యూయార్క్లోని నార్త్వెల్ ఆస్పత్రిలో 1,170 మంది రోగులపై ఈ మందును పరీక్షిస్తున్నారు. దీనితో అప్రమ్తతం అయిన భారత్ ఓ సమావేశం కూడా నిర్వహించింది. ఈ మందుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడితే ఏం చేయాలన్నదానిపై చర్చించింది. మన దేశంలో ఏటా 7 కోట్ల ఫెమోటీడైన్ మాత్రలు విక్రయమవుతాయి. వీటిని సన్ఫార్మా, టొరెంట్, క్యాడిలా కంపెనీలు తయారుచేస్తున్నాయి. ఒకవేళ.. ముందుముందుకు మరిన్ని సానుకూల ఫలితాలు వస్తేమాత్రం ఈ మాత్రల కోసం ప్రపంచ దేశాలు మళ్లీ భారత్ ముందు క్యూ కట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.