కొవిడ్19 ఆస్పత్రులపై కురిసిన పూలవర్షం..!
ప్రాణాలకు తెగించి పోరాడుతున్న కరోనా వారియర్స్కు అరుదైన గౌరవం దక్కింది. వారియర్స్కు సంఘీభావ సంకేతంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కొవిడ్ ఆస్పత్రులపై పూలవర్షం కురిపించింది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో సుమారు 1600మంది వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులు అందిస్తున్నారు. వైద్యసేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో పూలవర్షం కురిపించింది భారత వాయుసేన. శనివారం ఆస్పత్రి పరిసరాల్లో ట్రయల్రన్ నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ ఈరోజు హెలికాప్టర్ల ద్వారా ఆస్పత్రిపై పూలు చల్లింది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపై పోరాటం చేస్తున్న యోధులకు సంఘీభావం ప్రకటిస్తూ వారిపై పూలవాన కురి పించాలని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్రావత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని జయశంకర్ విగ్రహం వద్ద వాయుసేన హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రి వైద్యులు, స్టాఫ్నర్సులు, పారిశుధ్యం, పారామెడికల్, పోలీస్, నాల్గవ తరగతి ఉద్యోగులపై పూలవాన కురిపించారు. హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ కమాండ్ కెప్టెన్ కేఎస్ రాజు, గ్రూప్ కెప్టెన్ పంకజ్గుప్తా నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ పొందిన వాయుసేన దళాలు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాయి. ఈ క్షణం అద్భుతంగా.. అపురూపంగా సాగింది. వైద్యుల గొప్ప సేవలకు దక్కిన అపూర్వ గౌరవమని అందరూ ఆనందపడుతున్నారు.