దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది. ఎండాకాలంవల్ల రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, లాక్డౌన్ కారణంగా ఇండ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. వర్షం కారణంగా నగరం అంతటా వాతావరణం చల్లబడింది. అయితే.. మరోవైపు ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని కొంతమేరకు అడ్డుకోవచ్చునని పలువురు నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఎండలో కరోనా వైరస్ ఎక్కువగా బతకదని చాలా మంది నిపుణులు అంటున్నారు. ఇటీవల అమెరికా నిపుణుల బృందం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అయితే.. భారీ వర్షం వల్ల ఏర్పడే చల్లని వాతావరణంతో వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుందేమోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే... వర్షం ప్రభావం ఎక్కువ సమయం ఉండదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.