దేశంలో నానాటికీ కరోనా మహమ్మారి పెరిగిపోతూనే ఉంది. ఎక్కడ చూసినా కరోనా కేసులు పెరగడమే కాదు.. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా మన దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అయితే కరోనా కట్టడి చేయడానికి సాధ్యమైనంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.. ప్రజలు మాత్రం లాక్ డౌన్ నిర్లక్ష్యం చేయడం వల్ల కరోనా కేసులు తగ్గడం లేదని అంటున్నారు. ఇక లాక్ డౌన్ ఈ నెల 17 వరకు పెంచిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల రెడ్ జోన్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెడ్ జోన్ పరిథిలో లాక్ డౌన్ సీరియస్ గా కొనసాగిస్తున్నారు.
తాజాగా నిత్యావసర సరకుల నిమిత్తం వచ్చే వారు మాస్క్ లను ధరించకుంటే, వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ సరుకులు ఇవ్వరాదని, మాస్క్ తో వస్తేనే అనుమతించాలని హైదరాబాద్ పరిధిలోని కిరాణా షాపుల యజమానులకు అనధికారిక ఆదేశాలను అధికారులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా, తమతమ షాపులకు వచ్చే వారిలో అత్యధికులు మాస్క్ లను ధరించే వస్తున్నారని, కానీ కొంతమంది ఎటువంటి మాస్క్ లు లేకుండా వస్తున్నారని, వారి ద్వారా వ్యాపారాన్ని నష్టపోతున్నామని కొందరు వ్యాఖ్యానించారు.
కేసులు అధికంగా ఉన్న ముషీరాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో కస్టమర్ల మధ్య భౌతిక దూరం తప్పనిసరని, కస్టమర్లు నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత దుకాణదారులదేనని కూడా అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు షాపుల వద్ద మాస్క్ లు తప్పనిసరిగా ధరించి రావాలన్న బోర్డులను యజమానులు వేలాడదీశారు.