భారత్లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో రోజురోజుకూ వేగం పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం పది లక్షలకు పైగా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. మే 3వ తేదీ ఉదయం 10 గంటల వరకు మొత్తం 10,46,450 నమూనాలను పరీక్షించామని తెలిపింది. దేశంలో సుమారు 310 ప్రభుత్వ ప్రయోగశాలలు, 111 ప్రైవేట్ ప్రయోగశాలల్లో కరోనావైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐసిఎంఆర్ తెలిపింది. ఇదిలావుండగా.. భారత్లో ఇప్పటివరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 39,980 కు చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 28,046 ఉన్నాయి.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,301 మరణాలు సంభవించాయి. మొత్తం 10,632 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో దశ లాక్డౌన్ నేటితో ముగియనుంది. రేపటి నుంచి అంటే.. మే 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడో దశ లాక్డౌన్ కొనసాగనున్న విషయం తెలిసిందే. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది.