ఇటీవల దూకుడు అయిన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతోన్న విజయవాడ టీడీపీ ఎంపీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై విజయవాడ సిటీ పోలసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ స్ట్రిక్ట్గా అమలు అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాని ఈ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఆయన పై కేసు నమోదు చేసినట్టు విజయవాడ ఏసీపీ చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నెల 1న విజయవాడ నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 47వ డివిజన్ ప్రాంతంలో సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా కూరగాయలు పంపిణీ చేశారన్న అభియోగాలపై నానితో పాటు మరి కొందరు టీడీపీ నాయకులపై ఈ కేసులు నమోదు అయ్యాయి.
ఉత్తర్వులు ఉల్లంఘించి నందునే ఈ కేసులు పెట్టినట్టు విజయవాడ సీపీ తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో ఎంపీ నాని స్పందించారు. ఓ వైపు కరోనా ఉన్న వేళ పేద ప్రజలు తిండి లేక ఇబ్బందులు పడుతుంటే వారికి ఆహారం అందించినందుకు గాను దొంగ కేసులు బనాయించిన విజయవాడ సిటీ పోలీసులకు ధన్యవాదాలని.. మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్పారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు తాము ఉన్నది ఇంట్లో కూర్చోవడానికి కాదని ఆయన చెప్పారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న క్రమంలో కేసులు పెడితే తాను మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానే తప్పా ఎక్కడా వెనక్కి తగ్గనని చెప్పారు.