మద్యంప్రియులకు తెలంగాణ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. సోమవారం నుంచి గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు మాత్రం నో చెప్పేశారు. రేపటి నుంచి తెలంగాణలోని గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు లేవని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో మందు బాబుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. గ్రీన్ జోన్లో మద్యం అమ్మకాలకు అవకాశం ఇస్తే.. ఆ జోన్ ప్రాంతాల నుంచి రెడ్, ఆరెంజ్ జోన్లకు మద్యాన్ని అక్రమంగా తరలించే క్రమంలో గందరగోళ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అన్ని జోన్లలో లాక్డౌన్ యథావిధిగా కొనసాగించాలని చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ రోజు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఆరోగ్య, వ్యవసాయశాక ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ సడలింపులను ఇవ్వాలా..? వద్దా..? పంట కొనుగోళ్లు తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నెల 5న మంత్రివర్గ సమావేశం ఉంది. ఈనేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.