పంజాబ్లో కొవిడ్ -19 కలకలం రేపుతోంది. రాష్ట్రంలో వైరస్ అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక్క రోజులోనే ఏకంగా 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,102 కి చేరుకున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 117 మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 21మంది మరణించారు. ఇక 964యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. అయితే.. అమృత్సర్ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. వరుసగా రెండోరోజూ అంటే 24 గంటల వ్యవధిలోనే 75 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 218కి చేరుకుంది.
ఇక కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రోజురోజుకూ తీవ్రమవుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.