జమ్మూ కాశ్మీర్లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 35 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జమ్మూ డివిజన్ నుంచి ఒకటి, కాశ్మీర్ డివిజన్ నుండి 34 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 701కి చేరుకుంది. ఇందులో కశ్మీర్లో 640, జమ్మూలో 61 కేసులు నమోదు అయ్యాయని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సల్ వెల్లడించారు. కాగా, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది.
కాశ్మీర్ ప్రావిన్స్లోని అన్ని జిల్లాలు, జమ్మూలోని జమ్మూ, కతువా, సాంబా జిల్లాలను రెడ్ జోన్లుగా విభజించింది. రియాసి, ఉధంపూర్, రాంబన్ రాజౌరి జిల్లాలు ఆరెంజ్ జోన్ కిందకు వచ్చాయి. ఇక దోడా, కిష్త్వార్ పూంచ్ జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జోన్ల వారీగా లాక్డౌన్ నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. అయితే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.