ఇప్పటికే కరోనా వైరస్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పిడుగులు పడే ప్రమాదముందని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదముందని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, నిర్లక్ష్యంగా ఉండొద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ పేర్కొంది.
పిడుగుపాటుతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్న జిల్లాలు ఇదే.. శ్రీకాకుళం జిల్లాలో మెలియపుట్టి, పాతపట్నం టెక్కలి, నందిగం, పలాస, సోంపేట, కోటబొమ్మాలి, హిరమండలం, సర్వ కోట, కొత్తూరు, భామిని, సీతంపేట ఉన్నాయి. అలాగే.. విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, పాచిపెంట, మెంటాడ, దత్తిరాజేరు, గంట్యాడ, రామభద్రపురం, సాలూరు, గజపతినగరం ఉన్నాయి. విశాఖ జిల్లాలో అనంతగిరి, అరకులోయ, దేవరపల్లి, హుకుంపేట పాడేరు, చీడికాడ ఉన్నాయి. గుంటూరు జిల్లాలో బొల్లపల్లి, వెల్దుర్తి, దుర్గి ప్రాంతాలు ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లాలో ఆత్మకూరు, బండి ఆత్మకూరు, కొత్తపల్లె, ఓర్వకల్, హాలహర్వి, చిప్పగిరి మండలాల వ్యాప్తంగా పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.