ఆ డాక్టర్కు ఇదేం రోగమో..! ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనాపై పేషెంట్ను లైంగికంగా వేధించాడు. ముంబైలో గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నవీ ముంబై మెడికల్ కాలేజ్లో చదువుకున్న ఓ యువకుడు వోక్హార్డ్ హాస్పిటల్లో ఏప్రిల్ 30న వైద్యుడిగా చేరాడు. ఆ తర్వాతి రోజున ఓ కోవిడ్ పేషెంట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేరాడు. ఈ క్రమంలో అతడికి చికిత్స చేయడం మానేసి.. ఆ వైద్యుడు లైంగిక వేధింపులకు దిగాడు. అతడు ఉండే ఐసీయూ గదిలోకి వెళ్లి పేషెంట్తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు పేషెంట్ తీవ్ర ఆందోళనకు గురై.. వెంటనే అలారమ్ బటన్ను నొక్కడంతో మిగతా సిబ్బంది ఏం జరిగిందోనని వెంటనే అక్కడికి పరుగులు పెట్టారు. తీరా అక్కడికి వచ్చాక విషయం బయటపడింది.
బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు.. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు దవాఖానకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కరోనా వైరస్ సోకిన రోగికి సమీపంగా వెళ్లినందున వైరస్ సోకే ప్రమాదం ఉండవచ్చన్న అనుమానంతో అతడిని అరెస్ట్ చేయకుండా.. ప్రస్తుతం అతడిని థానేలోని స్వగృహంలో క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. మరోవైపు అతడిని ఉద్యోగం నుంచి యాజమాన్యం తొలిగించింది.