కరోనా కట్టడికి ఏపీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టినప్పుడే.. వైరస్ వ్యాప్తిని వేగంగా నియంత్రించే అవకాశం ఉంటుందని ఇప్పటికే అనేకమంది నిపుణులు చెబుతున్నారు. ఏపీ సర్కార్ కూడా అదే దారిలో నడుస్తోంది. వేగవంతంగా పరీక్షలు చేపట్టేందుకు దక్షిణ కొరియా నుంచి ప్రత్యేకంగా రెండు లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా.. స్వయంగా ఏపీలోనూ కిట్లను తయారు చేస్తోంది. ఈక్రమంలోనే దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. తాజాగా.. ఏపీ మరో రికార్డు సాధించింది. గడిచిన 24 గంటల్లో 10,292 శాంపిల్స్ను పరీక్షించింది. ఇందులో కేవలం 67 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తేలింది. వేల సంఖ్యలో పరీక్షలు చేస్తుండడం వల్లే..కాస్త ఎక్కువగా పాజిటివ్ కేసులు తేలుతున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా, తాజా లెక్కలతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 524 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 33 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1093 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 1, వైఎస్సార్ జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 12, కర్నూలు జిల్లాలో 25, విశాఖపట్నం జిల్లాలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి.