లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చిక్కుకున్న లక్షలాది మంది భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మే 7వ తేదీ నుంచి వారందరినీ ఇండియాకు దశలవారీగా తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని కోసం భారీ ఆపరేషన్ చేపట్టనున్నారు. విమానాలు, భారీ నౌకల ద్వారా వారిని తీసుకొస్తామని చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 22వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లయిట్స్ను ఏర్పాటు చేస్తున్నామని, ఆ విమాన సేవలు పేమెంట్ ఆధారంగా ఉంటాయని తెలిపింది.
అయితే.. విమానం ఎక్కేముందు ప్రతి ప్రయాణికుడికి కరోనా పరీక్షలు చేస్తామని, కేవలం లక్షణాలు లేని వారిని మాత్రమే భారత్కు తీసుకువస్తామన్నారు. ఒకసారి భారత్కు చేరుకున్న తర్వాత.. వారంతా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 14 రోజుల క్వారెంటైన్ తర్వాత కోవిడ్19 పరీక్ష చేయించుకోవాలని సూచించింది. మొదట గల్ఫ్ దేశాల నుంచి ఆ తర్వాత యురోప్ దేశాల్లో చిక్కుకున్నవారిని తీసుకురానుంది కేంద్రం. గల్ఫ్ దేశాల్లో సుమారు 80 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు అధికావర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త విన్న భారతీయులు, వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.