తెలంగాణలో అనూహ్య పరిణామం.. కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ రోజు కేవలం కొత్తగా 3 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1085కు చేరింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ రోజు నమోదైన మూడు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. ఈ రోజు 40మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక ఇప్పటి వరకు మొత్తం 585 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 471గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 29మంది కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇదిలా ఉండగా.. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం మే 7వ తేదీ వరకు లాక్డౌన్ విధించారు. అయితే.. మంత్రివర్గ సమావేశంలో లాక్డౌన్ పొడిగింపు, సడలింపులపై కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.