తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్లో మంగళవారం ఒక్కరోజు రైతు సంక్షేమ దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం చెందారని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రంలో అతితక్కువగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, కావాలనే ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేయడం వల్లే తెలంగాణలో తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయని ఆయన అన్నారు. ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ల్యాబ్ల్లో కూడా కరోనా నిర్ధారణ పరీక్షలను ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
అంతేగాకుండా.. లాక్డౌన్ కారణంగా పేదలు, వలస కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర నుంచి వలస కార్మికులు వెళ్లిపోతే.. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, అనేక రంగాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. వలస కూలీలు, కార్మికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, వారు ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కల్లాల్లో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా సహాయక చర్యల్లో భాగంగా ప్రతీ పేద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.