కేద్రం ఇచ్చిన లాక్డౌన్ సడలింపులతో దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి పలుచోట్ల మద్యం షాపులు తెరుచుకుంటున్నాయి. అప్పటి నుంచి మందుబాబుల ఆనందానికి అవధులేకుండా పోతోంది. షాపుల ముందు ఆడిపాడుతున్నారు. ఏపీలో అయితే మద్యం షాపు ముందు కొబ్బరికాయ కూడా కొట్టారు. తాజాగా.. ఢిల్లీలో మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. మీరే దేశ అర్థిక వ్యవస్థని కాపాడేది అంటూ మందుబాబులపై ఓ వ్యక్తి పూల వర్షం కురిపించాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మందుబాబులే ప్రభుత్వ ఖజానాని నింపేది అంటూ న్యూఢిల్లీలో చందేర్ నగర్లోని ఓ వైన్ షాప్ ఎదుట బారులుతీరిన మందుబాబులపై పూలు చల్లాడు.
మరోవైపు భారీ లైన్లలో లిక్కర్ కోసం మండుటెండలో నిల్చున్న మందుబాబులపై మిర్జాపూర్లో ఓ లిక్కర్ షాప్ యజమాని కూడా పూలవర్షం కురిపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడుతున్నారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు కావడం లేదు. ఇలా మద్యం షాపులు తెరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.