చెన్నై నగరంలో మద్యం అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో నెల తర్వాతే మద్యం దుకాణాలు తెరచుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ప్రకటించినట్లుగా మే 7 నుంచి చెన్నై నగరంలో మద్యం దుకాణాలు ప్రారంభం కావని స్పష్టంచేసింది. తమిళనాడు ప్రభుత్వం మే 7వ తేదీ నుంచి రాజధాని చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకణాలు ప్రారంభమవుతాయని రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చెన్నైలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో నగరం వరకు మద్యం దుకాణాలను తెరువద్దని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఒక నెల తర్వాత పరిస్థితిని బట్టి మద్యం దుకాణాలు తెరవనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కోయంబేడు మార్కటే కారణమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. రాజధాని చెన్నెలోని కోయంబేడు మార్కెట్ కరోనా హాట్స్పాట్గా మారి రాష్ర్టాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కోయంబేడు మార్కెట్ దేశంలోనే అతిపెద్ద కూరగాయలు, పండ్లు, పూల హోల్సేల్ మార్కెట్. 295 ఎకరాల్లో విస్తరించిన ఈ మార్కెట్లో మూడు వేలకుపైగా దుకాణాలున్నాయి. నిన్న రాష్ట్రంలో కొత్తగా 527 కరోనా కేసులు నమోదుకాగా అందులో ఎక్కువ శాతం కేసులు ఈ ప్రాంతానికి చెందినవే. కాగా, తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 3,550ని దాటగా మరణాల సంఖ్య 31గా ఉన్నది. ఒక్క చెన్నైలోనే మొత్తం 1,724 కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి.