కరోనా మనం కలిసి బతకాల్సిందేనని, ఇది ఇప్పుడే మనల్ని వదిలిపెట్టిపోదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ వైరస్ ఇప్పుడే పోదని, అందుకే మనం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మనం బతికేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే కరోనాను కట్టడి చేసేందుకు ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.
మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గం సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈనెల 29వ తేదీ వరకు తెలంగాణలో లాక్డౌన్ను పొడిగించినట్లు కేసీఆర్ ప్రకటించారు. అందరి నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతీ ఒక్కరు లాక్డౌన్ నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను యథావిధిగా అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనాను దాదాపుగా కట్టడి చేయగలిగామని, మరింత అప్రమత్తంగా ఉంటే మనకే మంచిదని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.