రైతు బంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత వరకూ రైతుబంధు పథకం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరో పనికిరానివాళ్లు చెప్పే ముచ్చట్లను పట్టించుకోవద్దని ఆయన అన్నారు. రైతుబంధు పథకానికి ఒక్క రూపాయి కూడా తగ్గించబోమని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ ఎస్ ఉన్నంత వరకూ రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతుందని ఆయన అన్నారు.
రైతుల అప్పులు తీరేదాకా.. సొంతంగా పెట్టుబడి పెట్టేస్థాయికి వచ్చేదాకా ఈ పథకం కొనసాగుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల కోసం ఏమీ చేయడం లేదని, ఇక్కడ దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ. 1198 కోట్లు ఒకటి రెండు రోజుల్లోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు. రూ.25వేల లోపు రుణం ఉన్నవారికి రేపే మాఫీ చేస్తామని ఆయన తెలిపారు. ఇక్కడ చిల్లర రాజకీయాలు చేయొద్దని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కేసీఆర్ సూచించారు.