తెలంగాణలో రేపటి నుంచి అన్ని జోన్లలో మద్యం షాపులను తెరుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో షాపులకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. మద్యం ధరలను 16 శాతం పెంచుతున్నామని ఆయన ప్రకటించారు. తక్కువ ధర మద్యంపై కేవలం 11 శాతం పెంచుతున్నామని ఆయన తెలిపారు.
ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులను తెరుస్తామని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలోని 15 షాపులు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో షాపులను తెరిచేందుకు అనుమతి ఇస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే.. మద్యంషాపుల నిర్వాహకులు, మందుబాబులకు కేసీఆర్ హెచ్చరిక చేశారు.
ప్రతీ ఒక్కరు తప్పకుండా భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాని, మాస్క్ లేకుంటే మద్యం అమ్మరని కేసీఆర్ హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలను పాటించకుంటే మాత్రం కీలక నిర్ణయం తీసుకోకతప్పదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ చుట్టుపక్కల ఉన్నరాష్ట్రాలు మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం వల్లే తెలంగాణలో కూడా తెరువాల్సిన పరిస్థితులు ఏర్పడ్దాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.