మందుబాబులా..మజాకా.! తెల్లవారకముందే మద్యంషాపుల ముందు మందుబాబులు వాలిపోతున్నారు. గంటలుగంటలు అక్కడే బారులు తీరుతున్నారు. నిలబడే ఓపికలేనివాళ్లు షాపు ముందే హాయిగా కూర్చొని ఉంటున్నారు. షాపు ఎప్పుడు తెరుస్తారా..? అని ఎదురుచూస్తూ ఉన్నారు. షాపులు తెరిచేదాకా.. కట్టుకదలకుండా.. దిక్కులు చూడకుండా... షాపులనే తదేకంగా చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల్లోనే మద్యం అమ్మకాల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. సుమారు వెయ్యికోట్ల రూపాయలకుపైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక పంజాబ్ ప్రభుత్వం ఏకంగా మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీ-కపశేర బార్డర్ లో వేకువ జామునే మద్యం షాపు తెరవకముందే జనాలు పెద్ద సంఖ్యలో చేరుకుని బారులుతీరారు. మరోవైపు హర్యానాలో ప్రభుత్వం నేటి నుంచి కంటైన్ మెంట్ జోన్ల మినహా గ్రీన్ జోన్లలో మద్యం షాపులు తెరుచుకునే అవకాశమిచ్చింది. దీంతో గురుగ్రామ్ లోని సోహ్నా అడ్డా చౌక్ లో ఉన్న ఓ మద్యం షాపు వద్దకు మందుబాబులు భారీగా చేరుకుంటున్నారు. మద్యం షాపులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరుచుకునే అవకాశమిచ్చారు. తాజాగా తెలంగాణలోనూ ఈరోజు నుంచి మద్యం షాపులను తెరిచేందుకు ప్రభుత్వంఅనుమతి ఇచ్చింది.