తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. నిన్నరాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే.. మందుబాబులు తెల్లారకముందే వైన్స్ల వద్ద బారులు తీరారు. షాపుల ముందు డ్యాన్స్ చేస్తున్నారు. మందుబాటిళ్లు పట్టుకుని సంబురాలు చేసుకుంటున్నారు. అయితే.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హైదరాబాద్ కొండాపూర్లోని ఓ వైన్స్ ముందు మందుబాబులేకాదు.. అమ్మాయిలు కూడా ఉదయాన్నే వచ్చి లైన్లో నిల్చున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే మొహాలకు మాస్కులతో అమ్మాయిలు మందు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టకుంటున్నాయి.
దాదాపుగా 40 రోజుల తర్వాత తెలంగాణలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో షాపుల ముందు భౌతికదూరం పాటించేలా షాపుల యజమానులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా పలుచోట్ల మందుబాబులు భౌతికదూరం పాటించకుండా బారులుతీరుతున్నారు. కాగా, తెలంగాణలో మొత్తం 2300 మద్యం షాపులు ఉండగా.. కంటైన్మెంట్ జోన్లోని 15 షాపులకు అనుమతి ఇవ్వలేదు.