కర్ణాటకలోని బెంగుళూరులో హత్య కేసు నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపుతోంది. ఘటన వివరాలను బెంగళూరు నార్త్ డివిజన్ డీసీపీ శశికుమార్ తెలియజేశారు. గత సోమవారం నాడు ప్రభు అనే వ్యక్తి ఇతర స్నేహితులతో కలిసి అర్జున్ సింగ్ అనే వ్యక్తితో ఆన్లైన్లో గేమ్ ఆడాడు. ఈ క్రమంలో ప్రభు, అర్జున్ సింగ్ ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత గొడవ గురించి అర్జున్ సింగ్ తన సోదరుడు కరణ్ సింగ్కు చెప్పాడు. దీనిపై అడిగేందుకు వచ్చిన కరణ్ సింగ్ను ప్రభు కత్తితో పొడిచి చంపాడు. ఇక అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు ప్రభు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రభు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రభు ఆచూకీపై సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. అయితే.. తప్పించుకునే క్రమంలో ప్రభు ఓ హెడ్ కానిస్టేబుల్ను గాయపరిచాడు. అనంతరం పారిపోతుండగా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా ప్రభు ఆగకుండా పారిపోయేందుకు ప్రయత్నించడంతో కుడి కాలిపై కాల్పులు జరిపారు. దీంతో ఎటూ కదలలేని స్థితిలో ఉన్న నిందితుడు ప్రభుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.