ఇప్పటికే కరోనా వైరస్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇప్పుడు మరో ప్రమాదం వచ్చిపడింది. విశాఖపట్టణం జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్ కావడంతో పలువురు స్పృహతప్పి పడిపోతున్నారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రసాయన వాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు గుర్తించారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంటిపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. ఈ ఘటనతో భయాందోళనలతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్దకు చేరుకుని ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సైరన్లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఘటనాస్థలికి పదుల సంఖ్యలో అంబులెన్సులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి వేరే ప్రాంతాలకు పోలీసులు తరలిస్తున్నారు. ఈ ఊహించని ఘటనతో స్థానికంగా తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందోనని అధికారులు, ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.