ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పోలీసులు వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇందులో ఎక్కువగా వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా వైద్యులు, నర్సులే ఉంటున్నారు. అందులోనూ దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పవరకు దేశవ్యాప్తంగా 548 మంది డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ఢిల్లీలోనే 69 మంది వైద్యులకు వైరస్ సోకిందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్యసిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, ల్యాబ్ సహాయకులు మరెంతో మంది కరోనా బారినపడ్డారని, ఆ సంఖ్య కచ్చితంగా చెప్పలేమన్నారు.
ఇటీవల పశ్చిమబెంగాల్లో ఏకంగా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధిరి కూడా మరణించిన విషయం తెలిసిందే. ఆ మరునాడే మరో డాక్టర్ కూడా మరణించారు. ఇక ముంబైలో ముగ్గరు పోలీసులు కూడా కరోనాతో మరణించారు. ఈ పరిణామాలతో వైద్య, పోలీస్ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. అయినా.. ప్రాణాలను లెక్కచేయకుండా కరోనాపై పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా వర్గాలకు దేశమంతా జేజేలు పలుకుతోంది.