విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదకరమైన గ్యాస్ లీకేజీ కలకలం రేపుతోంది. ఇటీవల కాలం వరకు లాక్ డౌన్ లో ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టేరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా , వందల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. మరో రెండు రోజుల పాటు దీని ప్రభావం ఉండే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా లీకైన రసాయన గాలి పీల్చడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నాయుడు తోట పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు.
కాగా రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపై పడిపోయారు. ఈ క్రమంలో పరుగులు తీసే క్రమంలో వెంకటాపురం గ్రామంలో గంగరాజు అనే వ్యక్తి నేలబావిలో పడిపోయి చనిపోవడం గమనార్హం. అంతేగాకుండా.. మరికొందరు బయటకు పరుగులు తీస్తూ పలు బావుల్లో పడిపోయినట్లు తెలుస్తోంది. అలాగే.. ఆ ప్రాంతంలో పలు పశవులు కూడా మృత్యువాతపడ్డాయి. వెంకటాపురం గ్రామంలోని పచ్చని చెట్ల ఆకులు కూడా నల్లగా మాడిపోయాయి. ఈ క్రమంలో చుట్టుపక్కల బావులు, కాలువల్లో ఎవరైనా పడిపోయారా..? అని అధికారులు వెతుకుతున్నారు.