ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ 50కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1833కు చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,087 శాంపిల్స్ ని పరీక్షించగా 56 మందికి కరోనా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 16 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. 
 
ప్రతిరోజూ అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న కర్నూలు జిల్లాలో మాత్రం ఏడు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా కేసులు నమోదు కాని విజయనగరం జిల్లాలో ఒకేరోజు మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందింది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 540 కేసులు నమోదు కాగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందటంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 38కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: